_ ఇంద్రా రెడ్డి నగర్లో విషాదం
_ కుటుంబ కలహాలే కారణం?
_. కుళ్ళి పోయిన మృతదేహాలను గుర్తించిన పోలీసులు
జనవాహిని ప్రతినిధి తాండూరు; కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై తల్లి, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇంద్రా రెడ్డి నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జినుగుర్తి గేటు సమీపంలోని ఇంద్రా రెడ్డి నగర్లోని ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కొత్తలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రమేష్ అనే వ్యక్తి వచ్చి, మృతదేహాలను తన అక్క తుల్జమ్మ, ఆమె కుమారుడు నరేష్గా గుర్తించాడు.
కోటా బాస్ పల్లి గ్రామానికి చెందిన నరేష్కు కర్ణాటకలోని మిరానంకు చెందిన మౌనికతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి భవాని అనే కుమార్తె ఉంది. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య సంసారం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మౌనిక తన కూతురిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది. గత పది రోజుల క్రితం మళ్లీ కోటా బాస్ పల్లికి వచ్చిన మౌనిక, భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తుల్జమ్మ, ఆమె కొడుకు నరేష్ పది రోజుల క్రితమే ఇల్లు వదిలి వెళ్లారు. బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మధ్యాహ్నం ఇంద్రా రెడ్డి నగర్లోని ఒక రూమ్లో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులకు సమాచారం అందింది. మృతుని మేనమామ కమ్మరి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

