- మహిళల హామీలను విస్మరించిన కాంగ్రెస్
- తాండూరు భద్రేశ్వర కూడలిలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో వంటా-వార్పు
- మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి తీవ్ర విమర్శలు
జనవాహిని ప్రతినిధి తాండూరు; ఎన్నికల హామీలను గాలికొదిలేసి కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలను తీవ్రంగా మోసం చేసిందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి విమర్శించారు. బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో శుక్రవారం తాండూరులోని భద్రేశ్వర కూడలిలో కాంగ్రెస్ వెయ్యి రోజుల పాలనపై వృద్ధులు, వికలాంగులు, మహిళల సదస్సుతో పాటు వంటా-వార్పు నిరసన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా రోహిత్ రెడ్డి మాట్లాడుతూ… నెలకు రూ.2,500 జీవన భృతి, కళ్యాణలక్ష్మి కింద తులం బంగారం ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం, వెయ్యి రోజులు గడిచినా ఒక్క హామీనీ నెరవేర్చలేదని మండిపడ్డారు. అధికారంలోకి వచ్చాక వివాహం చేసుకున్న ఒక్క మహిళకైనా తులం బంగారం అందజేశారా అని ప్రశ్నించారు. ఆసరా పెన్షన్ను రూ.2 వేల నుంచి రూ.4 వేలకు పెంచుతామన్న హామీ ఏమైందని నిలదీశారు.
ఉచిత బస్సు సౌకర్యం పేరిట తగినన్ని బస్సులు నడపకపోవడంతో తాండూరు నుంచి మహబూబ్నగర్ వెళ్లే ప్రయాణికులు గంటల తరబడి బస్ స్టాండ్లోనే నిరీక్షించాల్సి వస్తోందన్నారు. అలాగే రూ.500 గ్యాస్ సిలిండర్ పథకాన్ని కొద్దిమందికే పరిమితం చేసి, అందరికీ వర్తింపజేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని దుయ్యబట్టారు. కోటి మంది మహిళలను కోటీశ్వరులను చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి మాట తప్పారని, కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి మరిచిన హామీల సాధన కోసం బీఆర్ఎస్ పోరాటం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.



