- 1000 రోజుల కాంగ్రెస్ వైఫల్యాలపై బిఆర్ఎస్వి పోరుబాట
- ఇందిరా చౌక్ను ముట్టడించిన ‘జెన్ జీ’ యువత..
- కాంగ్రెస్ పై విమర్శలు చేసిన మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు; రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 1000 రోజులు పూర్తయినా విద్యార్థులు, యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని ఆరోపిస్తూ బిఆర్ఎస్ విద్యార్థి విభాగం తాండూరు లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పట్టణంలోని ప్రధాన కూడలి ఇందిరా చౌక్ వద్దకు యువత భారీగా తరలిరావడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయి, ఇందిరా చౌక్ పూర్తిగా స్తంభించిపోయింది.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి కాంగ్రెస్ సర్కార్పై విమర్శలు చేశారు. గత ఎన్నికల ముందు విద్యార్థులను, నిరుద్యోగులను ఆకట్టుకునేలా ఇచ్చిన హామీలు ఏమయ్యాయి? అంటూ ప్రశ్నించారు. ప్రభుత్వం ను నిలదీస్తున్న యువత గొంతు నొక్కాలని చూస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. ప్రజా సమస్యలపై బిఆర్ఎస్ పోరాటాన్ని ఆపడం ఎవరి తరమూ కాదని, అవసరమైతే ఈ ప్రభుత్వ పీఠాన్ని కదిలించేందుకు యువత సిద్ధంగా ఉంది అని స్పష్టం చేశారు. నాయకులు, విద్యార్థులు మాజీ ఎమ్మెల్యే రోహిత్ రెడ్డితో సెల్ఫీలు దిగేందుకు ఆసక్తి చూపడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా మున్ముందు ఆందోళనలు మరింత తీవ్రతరం చేస్తామని బిఆర్ఎస్వి నేతలు హెచ్చరించారు.



