- బీసీ శ్మశాన వాటికల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించాలి
- వెంటనే ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలని కందుకూరి రాజ్కుమార్ డిమాండ్
- సానుకూలంగా స్పందించిన చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు; పట్టణంలోని బీసీ శ్మశాన వాటికల్లో నెలకొన్న తీవ్ర పారిశుధ్య సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు, తాండూరు నియోజకవర్గ కన్వీనర్ కందుకూరి రాజ్కుమార్ ఆధ్వర్యంలో మంగళవారం మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడించారు. అనంతరం శ్మశాన వాటికల దుస్థితిపై మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి, కమిషనర్లకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా రాజ్కుమార్ మాట్లాడుతూ… పాత తాండూరులోని శ్మశాన వాటికతో పాటు, పోలీస్ స్టేషన్ వెనుక ఉన్న బీసీ శ్మశాన వాటికలు కనీస సౌకర్యాలు లేక తీవ్ర దుర్భరంగా మారాయని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రాంగణమంతా చెత్తాచెదారం, దుర్గంధం, ముళ్లచెట్లతో నిండిపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. వెంటనే జేసీబీలు, ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ప్రత్యేక డ్రైవ్ ద్వారా పిచ్చిమొక్కలు, వ్యర్థాలను తొలగించాలని, శ్మశాన వాటికల్లో కనీస వసతులు కల్పించి అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు.
బీసీ సంఘం ప్రతినిధులు అందజేసిన వినతిపత్రంపై మున్సిపల్ చైర్పర్సన్ నీరజా బాల్రెడ్డి సానుకూలంగా స్పందించారు. శ్మశాన వాటికల్లో తక్షణమే ప్రత్యేక పారిశుధ్య డ్రైవ్ చేపడతామని, పేరుకుపోయిన చెత్తాచెదారాన్ని, ముళ్లచెట్లను తొలగించి ప్రాంగణాలను పరిశుభ్రంగా మారుస్తామని హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో బీసీ సంఘం రాష్ట్ర నాయకులు సయ్యద్ షుకూర్, జిల్లా నాయకులు గడ్డం వెంకటేశ్, మండల అధ్యక్షులు నరేందర్, నాయకులు బసంత్ కుమార్, లక్ష్మణాచారి, మత్స్యకార సంఘం నాయకులు నరహరి, రాములు, పక్కిరప్ప, నాయి బ్రాహ్మణ సమాజం నాయకులు పరమేశ్, బాలరాజ్, శ్రీనివాస్, సోషల్ మీడియా ఇన్చార్జ్ బస్వరాజ్, రాము ముదిరాజ్, రాజు గౌడ్, ప్రదీప్ తదితరులు పాల్గొన్నారు.



