- కొకట్ కాగ్న వాగులోనే గణనాథుల నిమజ్జనం
- గ్రామ పెద్దలతో చర్చలు జరిపిన హిందూ ఉత్సవ సమితి
- సమస్య పరిష్కారం కావడంతో సర్వత్రా హర్షం
జనవాహిని ప్రతినిధి తాండూరు;
వినాయక చవితి వేడుకల్లో అత్యంత కీలకమైన విగ్రహాల నిమజ్జనానికి ఎదురైన అడ్డంకులు ఎట్టకేలకు తొలగిపోయాయి. ప్రతి ఏటా నిర్వహించే విధంగానే ఈ సారి కూడా యాలల మండలం కొకట్ కాగ్న వాగులోనే గణేష్ విసర్జన కార్యక్రమాన్ని వైభవంగా చేపట్టనున్నట్లు తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు వెల్లడించారు.
రసాయన రంగులతో తయారు చేసిన విగ్రహాలను వాగులో కలపడం వల్ల నీరు తీవ్రంగా కలుషితమవుతోందని, నిమజ్జనం పూర్తయిన తర్వాత వాగు శుభ్రతను పూర్తిగా విస్మరిస్తున్నారని కొకట్ గ్రామ పెద్దలు గత కొన్ని రోజులుగా నిమజ్జనానికి అభ్యంతరం తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో శనివారం తాండూరు హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులు కొకట్ గ్రామ పెద్దలు, యువకులతో సమగ్రంగా చర్చించారు.
గ్రామస్థులు లేవనెత్తిన అంశాలపై స్పందించిన సమితి నాయకులు, నిమజ్జన ప్రక్రియ ముగిసిన వెంటనే వాగు శుభ్రతా కార్యక్రమాలు, ఇతర తదుపరి పనులన్నింటికీ పూర్తి బాధ్యత వహిస్తామని స్పష్టమైన హామీ ఇచ్చారు. సమితి ఇచ్చిన హామీతో సంతృప్తి చెందిన గ్రామ పెద్దలు నిమజ్జనానికి అంగీకారం తెలిపారు. ఈ సందర్భంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ హిందూ ఉత్సవ సమితి ధన్యవాదాలు తెలిపింది.
ఈ సమావేశంలో తాండూరు మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ బాల్రెడ్డి, హిందూ ఉత్సవ సమితి ప్రధాన కార్యదర్శి బిర్కెట్ రఘు, గ్రామ పెద్దలు, యువకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

