- న్యాయస్థానంలో అంతిమ విజయం మాదే: శశి ప్రభ మాణిక్ రావు
- 12 ఏళ్ల తర్వాత కేసులో కీలక పరిణామం
జనవాహిని ప్రతినిధి తాండూరు; న్యాయం వైపే విజయం ఉంటుందని, విద్యా వికాస సమితి ట్రస్ట్ ఆస్తుల వివాదంలో న్యాయస్థానంలో అంతిమ విజయం తమదేనని ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టులో జరిగిన విచారణకు హాజరైన ఆమె, కేసుకు సంబంధించిన కీలక పత్రాలను, విలువైన సమాచారాన్ని న్యాయమూర్తికి అందజేశారు.
ఈ సందర్బంగా ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ… గత 12 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో నేడు కీలక పురోగతి లభించిందన్నారు. ట్రస్ట్ ఆస్తులను ఆక్రమించాలని చూస్తున్న అసాంఘిక శక్తులకు కోర్టులో జరిగిన పరిణామాలు తగిన బుద్ధి చెప్పాయని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి మాణిక్ రావు ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ… ట్రస్ట్ ఆస్తులను పరిరక్షించి, తాండూరు ప్రాంత ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంతటి ఆటంకాలు ఎదురైనా ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ విచారణ సమయంలో ట్రస్ట్ ప్రతినిధులు, న్యాయవాదులు రామకృష్ణ, రఘు ముదిరాజ్ మరియు ఇతర సభ్యులు ఆమె వెంట ఉన్నారు.

