జానవాహిణి బ్యూరో భానుబాబు :- హుస్నాబాద్ పట్టణానికి చెందిన మునిసిపల్ కౌన్సిలర్ చిత్తారి పద్మారవీందర్ ను జాతీయ ఉత్తమ కౌన్సిలర్ అవార్డుకి ఎంపిక చేసినట్లు బహుజన సాహిత్య అకాడమీ జాతీయ అధ్యక్షుడు నల్లా రాధాకృష్ణ తెలిపారు.సోమవారంనాడు హైదరాబాద్ జాతీయ కార్యాలయంలో జరిగిన అవార్డు సెలక్షన్ సమావేశంలో పద్మకు ఎంపిక పత్రాన్ని అందించారు. ఈ సందర్భంగా రాధాకృష్ణ మాట్లాడుతూ.. పద్మ హుస్నాబాద్ మున్సిపల్ కౌన్సిలర్ గా 2 పర్యాయాలు గెలిచి ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని తెలిపారు. కరోనా విపత్కర సమయంలో బాధితులకు అండగా నిలిచారని, బియ్యం, నిత్యావసర సరుకులు, కూరగాయలు, మందులు పంపిణీ చేశారని అన్నారు. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న వార్డులో త్రాగునీరు, వీధి దీపాలు, పారిశుధ్యం, హరితహారం వంటి సౌకర్యాలు కల్పించారని తెలిపారు. అలాగే అనేక స్వచ్ఛంద సంస్థల కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటూ, సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ ఎందరో మహిళా ప్రజా ప్రతినిధులకు ఆదర్శంగా నిలుస్తున్నారని కొనియాడారు. వారి సేవా నిరతను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశామని అన్నారు. ఈ నెల 11న తిరుపతిలో జరిగే దక్షిణ భారత బహుజన రచయితల సదస్సులో ఈ అవార్డు బహూకరిస్తామని తెలిపారు.కాగా తనను అవార్డుకి ఎంపిక చేసిన జాతీయ అధ్యక్షులు రాధాకృష్ణకు, రాష్ట్ర అధ్యక్షుడు ఎం.ఎం. గౌతమ్ కు, స్టేట్ కమిటీ మెంబర్ ముక్కెర సంపత్ కుమార్ లకు పద్మ కృతజ్ఞతలు తెలిపారు.