Home Blog

గణేష్ ఉత్సవాలకు పకడ్బందీ ఏర్పాట్లు ..!

0
  • భక్తిశ్రద్ధలు, ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు
  • అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
  • తాండూరులో ఘనంగా పీస్ కమిటీ సమావేశం
  • తాండూరు ఆర్డీఓ కర్ర అనిత

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు డివిజన్ పరిధిలో గణేష్ చవితి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని ఆర్డీఓ కర్ర అనిత పిలుపునిచ్చారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో ప్రత్యేక పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా ప్రజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, గణేష్ మండపాలు మరియు నిమజ్జన మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ముక్యంగా నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్‌కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు శాఖకు సూచించారు.
విద్యుత్ లైన్ల లూజ్ వైర్లను సరిచేయడం, రోడ్ల మరమ్మతులు, నిరంతర తాగునీటి సరఫరా మరియు పారిశుధ్య లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్‌పర్సన్ నీరజ బాల్రెడ్డి, డిఎస్పి నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, సిఐలు, వివిధ శాఖల డిఈలు, ఏఈలు, తాండూరు, యాలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు మరియు ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.

అవినీతిపై ‘ఆర్టీఐ…!

0
  • తాండూరు మున్సిపాలిటీలో నిధుల గోల్‌మాల్‌పై ఆర్టీఐ వేసిన జావీద్
  • మైనర్ డ్రైవింగ్‌కు అడ్డుకట్ట వేయాలి

జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు పురపాలక సంఘంలో ప్రజాధనం విచ్చలవిడిగా దుర్వినియోగమవుతోందని, దీనిపై అధికారులను నిలదీస్తూ సమాచార హక్కు చట్టం (ఆర్టీఐ) కింద దరఖాస్తు చేసినట్లు బిఆర్‌ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ జావీద్ తెలిపారు. ఈ సందర్బంగా జావీద్ మాట్లాడుతూ….
పట్టణంలో మైనర్లు వాహనాలు నడపడం వల్ల ఇటీవల చోటుచేసుకున్న ప్రమాదాలు తీవ్ర బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు వెంటనే స్పందించి మైనర్లతో పాటు వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించాలన్నారు. పిల్లలకు 18 ఏళ్లు నిండి, డ్రైవింగ్ లైసెన్స్ వచ్చిన తర్వాతే వాహనాలు ఇవ్వాలని తల్లిదండ్రులకు విజ్ఞప్తి చేశారు. అదేవిదంగా తాండూరు
మున్సిపాలిటీలో అవినీతి తాండవిస్తోందని కౌన్సిలర్ జావీద్ ఆరోపించారు. క్షేత్రస్థాయిలో నెలకు 2,000 లీటర్ల డీజిల్ వాడితే, రికార్డుల్లో మాత్రం 4,000 లీటర్ల బిల్లులు చూపిస్తూ నిధులు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శించారు. డీజిల్ వినియోగం, సానిటేషన్ మెటీరియల్ కొనుగోళ్లపై పూర్తి వివరాలు అందించాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆర్టీఐ ద్వారా కోరినట్లు వెల్లడించారు.
అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి అక్రమాలకు సహకరిస్తే ఊరుకునేది లేదని అధికారులను హెచ్చరించారు. బాధ్యులపై విజిలెన్స్ విచారణ జరిపించి కోర్టు వరకు తీసుకెళ్తామన్నారు. కేవలం ప్యాచ్ వర్క్‌లకే పరిమితం కాకుండా రోడ్లు, డ్రైనేజీల నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఆర్టీఐకి సరైన సమాధానం రాకపోతే పోరాటాన్ని మరింత తీవ్రతరం చేస్తామని స్పష్టం చేశారు.

ఆస్తులను కాపాడి ప్రజలకు అంకితం చేస్తాం

0
  • న్యాయస్థానంలో అంతిమ విజయం మాదే: శశి ప్రభ మాణిక్ రావు
  • 12 ఏళ్ల తర్వాత కేసులో కీలక పరిణామం

జనవాహిని ప్రతినిధి తాండూరు; న్యాయం వైపే విజయం ఉంటుందని, విద్యా వికాస సమితి ట్రస్ట్ ఆస్తుల వివాదంలో న్యాయస్థానంలో అంతిమ విజయం తమదేనని ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు స్పష్టం చేశారు. గురువారం జిల్లా ప్రిన్సిపల్ అండ్ సెషన్స్ కోర్టులో జరిగిన విచారణకు హాజరైన ఆమె, కేసుకు సంబంధించిన కీలక పత్రాలను, విలువైన సమాచారాన్ని న్యాయమూర్తికి అందజేశారు.
ఈ సందర్బంగా ఆమె ఓ ప్రకటనలో మాట్లాడుతూ… గత 12 ఏళ్లుగా సాగుతున్న ఈ కేసులో నేడు కీలక పురోగతి లభించిందన్నారు. ట్రస్ట్ ఆస్తులను ఆక్రమించాలని చూస్తున్న అసాంఘిక శక్తులకు కోర్టులో జరిగిన పరిణామాలు తగిన బుద్ధి చెప్పాయని వ్యాఖ్యానించారు.
మాజీ మంత్రి మాణిక్ రావు ఆశయ సాధనకు కట్టుబడి ఉన్నామని పేర్కొంటూ… ట్రస్ట్ ఆస్తులను పరిరక్షించి, తాండూరు ప్రాంత ప్రజలకు ఉచితంగా విద్య, వైద్యం, ఉపాధి అవకాశాలు అందిస్తామని హామీ ఇచ్చారు. ఎంతటి ఆటంకాలు ఎదురైనా ధర్మమే గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.
ఈ విచారణ సమయంలో ట్రస్ట్ ప్రతినిధులు, న్యాయవాదులు రామకృష్ణ, రఘు ముదిరాజ్ మరియు ఇతర సభ్యులు ఆమె వెంట ఉన్నారు.

ఆసుపత్రి పై నిర్లక్ష్యం ఎందుకు …?

0
  • కాయకల్ప పొందిన ఆస్పత్రిలో కంపు కొడుతున్న పారిశుధ్యం
  • ఆధ్వానంగా మాతృ శిశు సంరక్షణ కేంద్రం
  • ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కనే ఉన్నా పట్టించుకోరా?
  • ప్రశ్నిస్తే కేసులు పెట్టడం కాదు… అభివృద్ధి చేసి చూపించండి: 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ సవాల్

జనవాహిని ప్రతినిధి తాండూరు; గతంలో ప్రతిష్టాత్మక ‘కాయకల్ప’ అవార్డు సాధించిన మాత శిశు సంరక్షణ ఆసుపత్రి ప్రస్తుతం పారిశుధ్య లోపంతో కంపు కొడుతోందని, పాలకులు దీన్ని పూర్తిగా గాలికొదిలేశారని 8వ వార్డు కౌన్సిలర్ జావీద్ మండిపడ్డారు. గురువారం హైదరాబాద్ రోడ్డు మార్గంలోని మాత శిశు ఆస్పత్రి ని అయన సందర్శించారు. ఆసుపత్రి దుస్థితిపై ఆందోళన వ్యక్తం చేశారు.
రోజూ పదుల సంఖ్యలో పసిపిల్లలు, గర్భిణులు, బాలింతలు వచ్చే ఆస్పత్రిలో పారిశుధ్య వ్యవస్థ పూర్తిగా పడకేసిందని మండిపడ్డారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కనే ఉన్న ఈ ఆస్పత్రిని పట్టించుకోకపోవడం పాలకుల నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. ప్రాంతాభివృద్ధిని విస్మరించిన కాంగ్రెస్ నాయకులు, ఎమ్మెల్యే, చైర్మన్ తమ విఫలత్వాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. స్థానిక సమస్యలు, అభివృద్ధిపై ప్రశ్నిస్తే సమాధానం చెప్పలేక, బాధ్యతాయుతంగా పనిచేయాల్సింది పోయి కేసులు పెట్టి రిమాండ్‌కు పంపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. చేతనైతే అభివృద్ధి చేసి చూపించాలి తప్ప బెదిరింపులకు దిగడం సరికాదని సవాల్ విసిరారు.
ఆస్పత్రిలోని డ్రైనేజీ నీరు రోడ్డుపై పారుతూ తమ 8వ వార్డులోకి వస్తోందని, దీనివల్ల వార్డు ప్రజలు దుర్వాసనతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా జిల్లా కలెక్టర్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఆస్పత్రిలో పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచాలని, డ్రైనేజీ సమస్యకు తక్షణమే శాశ్వత పరిష్కారం చూపాలని డిమాండ్ చేశారు.

గణేష్ కమిటీకి రూ. 51,000 విరాళం..!

0
  • గణేష్ ఉత్సవాలకు కౌన్సిలర్ కుమారుడి విరాళం
  • రూ. 51,000 విరాళమిచ్చిన అజాస్
  • కులమతాలకు అతితంగా పండగ జరుపుకోవాలని సూచన. ..!

జనవాహిని ప్రతినిధి తాండూరు; వినాయక చవితి ఉత్సవాలను పురస్కరించుకుని మున్సిపల్ పరిధిలో భక్తిశ్రద్ధలు, ఆధ్యాత్మిక వాతావరణం సంతరించుకున్నాయి. ఈ నేపథ్యంలో 25వ వార్డు కౌన్సిలర్ నాసిర్ భాను కుమారుడు బిఆర్ఎస్ సీనియర్ నాయకులు     అజాస్ తన ఉదారతను చాటుకున్నారు.
వార్డులోని యువకులు శివాజీ చౌక్ ప్రాంతంలో ఏర్పాటు చేసిన గణేష్ ఉత్సవ కమిటీకి ఆయన తన వంతు సహకారంగా రూ. 51,000 నగదును చందా రూపంలో కమిటీ ప్రతినిధులకు శాలువాతో సత్కరించి అందజేశారు.
ఈ సందర్భంగా అజాస్ మాట్లాడుతూ… భక్తి భావంతో పాటు ప్రశాంత వాతావరణంలో, కులమతాలకు అతీతంగా గణపతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలన్నారు. యువకులు చేపడుతున్న ఇలాంటి సామాజిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మా కుటుంబం ఎల్లప్పుడూ పూర్తి మద్దతుగా ఉంటుందని తెలిపారు.
అనంతరం గణేష్ కమిటీ సభ్యులు మరియు వార్డు యువకులు కౌన్సిలర్ నాసిర్ భాను కుటుంబానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. యువతకు ప్రోత్సాహాన్ని ఇస్తూ ముందుకు వచ్చిన అజాస్‌ను వార్డు ప్రజలు, మున్సిపల్ నాయకులు అభినందించారు.
ఈ కార్యక్రమంలో గణేష్ కమిటీ ప్రతినిధులు, వార్డు నాయకులు, యువకులు కాలనీవాసులు పాల్గొన్నారు.

మనస్తాపంతో తల్లి, కొడుకు ఆత్మహత్య..!

0

_ ఇంద్రా రెడ్డి నగర్‌లో విషాదం
_ కుటుంబ కలహాలే కారణం?
_. కుళ్ళి పోయిన మృతదేహాలను గుర్తించిన పోలీసులు

జనవాహిని ప్రతినిధి తాండూరు; కుటుంబంలో తలెత్తిన మనస్పర్థల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురై తల్లి, కొడుకు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఇంద్రా రెడ్డి నగర్ పరిధిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… జినుగుర్తి గేటు సమీపంలోని ఇంద్రా రెడ్డి నగర్‌లోని ఒక గదిలో ఇద్దరు వ్యక్తులు చనిపోయి ఉన్నారనే సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ఈ క్రమంలో కొత్తలాపూర్ గ్రామానికి చెందిన కమ్మరి రమేష్ అనే వ్యక్తి వచ్చి, మృతదేహాలను తన అక్క తుల్జమ్మ, ఆమె కుమారుడు నరేష్‌గా గుర్తించాడు.
కోటా బాస్ పల్లి గ్రామానికి చెందిన నరేష్‌కు కర్ణాటకలోని మిరానంకు చెందిన మౌనికతో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి భవాని అనే కుమార్తె ఉంది. అయితే, కొంతకాలంగా భార్యాభర్తల మధ్య సంసారం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ క్రమంలో మౌనిక తన కూతురిని తీసుకుని తల్లిగారింటికి వెళ్లిపోయింది. గత పది రోజుల క్రితం మళ్లీ కోటా బాస్ పల్లికి వచ్చిన మౌనిక, భర్తతో కాపురం చేయడం ఇష్టం లేదని చెప్పి తిరిగి వెళ్ళిపోయింది.
ఈ ఘటనతో తీవ్ర మనస్తాపానికి గురైన తుల్జమ్మ, ఆమె కొడుకు నరేష్ పది రోజుల క్రితమే ఇల్లు వదిలి వెళ్లారు. బంధువులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించలేదు. మంగళవారం మధ్యాహ్నం ఇంద్రా రెడ్డి నగర్‌లోని ఒక రూమ్‌లో ఇద్దరూ పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులకు సమాచారం అందింది. మృతుని మేనమామ కమ్మరి రమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు.

ట్రస్ట్ భూములను కాపాడుకుంటాం. ..!

0
  • ఘనంగా నివాళులర్పించిన విద్యా వికాస్ సమితి ట్రస్ట్
    తాండూరు ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉన్నాం: శశి ప్రభ మాణిక్ రావు

జనవాహిని ప్రతినిధి తాండూరు; ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి, ఏఐసీసీ మాజీ సభ్యులు ఎం. మాణిక్ రావు వర్ధంతి వేడుకలు మంగళవారం విద్యా వికాస్ సమితి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి.
ట్రస్ట్ మేనేజింగ్ చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు, స్థానిక నాయకులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని ఆయనకు ఘనంగా నివాళులర్పించారు. ముందుగా మాణిక్ రావు చిత్రపటానికి, విగ్రహానికి పూలమాలలు వేసి అంజలి ఘటించారు. అనంతరం ఆయన సమాధి స్థలంలో హిందూ సాంప్రదాయ ప్రకారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.
ఈ సందర్భంగా ట్రస్ట్ చైర్మన్ శశి ప్రభ మాణిక్ రావు మాట్లాడుతూ… తాండూరు ప్రజల విద్యా, వైద్యం, ఉపాధి అభ్యున్నతి కోసమే మాణిక్ రావు తమ కోట్లాది రూపాయల ఆస్తులను ట్రస్ట్ పేరిట రిజిస్ట్రేషన్ చేశారని తెలిపారు. భూబకాసురులు, ల్యాండ్ గ్రాబర్లు ఈ ఆస్తులను అన్యాక్రాంతం చేయాలని చూస్తే, వందలాది మంది న్యాయవాదులను ఏర్పాటు చేసుకుని 14 కేసుల్లో సుదీర్ఘంగా పోరాడి గెలిచామని చెప్పారు. మాణిక్ రావు ఆశయం ప్రకారం విద్యా వికాస సమితి ట్రస్ట్ ఆస్తులు తాండూరు ప్రజల సంక్షేమానికే ఉపయోగపడతాయని ఆమె స్పష్టం చేశారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ డైరెక్టర్లు లక్ష్మారెడ్డి, ఎన్. రామకృష్ణ, ఎన్. రఘు ముదిరాజ్, కె. చంద్రకాంత్, బిఆర్ఎస్ నేత శుభప్రద పటేల్, ట్రస్ట్ లీగల్ అడ్వైజర్ పెద్దేముల్ అరుణ్ రాజ్, కచ్చి సయ్యద్, ముస్తఫా పటేల్, భాను ప్రసాద్, వర్కింగ్ జర్నలిస్టులు, మాణిక్ రావు అభిమానులు పాల్గొన్నారు.

సారే వస్తాడు…!

0

_ బ్రష్టు పట్టించిన రాష్ట్రాని బంగారం గా మారుస్తాడు
_ రౌడీలతో దాడులు చేయిస్తున్నారు రేవంత్ రెడ్డి
_ రాష్ట్ర ప్రజలందరూ కెసిఆర్ కోసం ఎదురుచూస్తున్నారు
_ ఇంకా మీ ఆటలు సాగవు ; తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జి శ్రీశైల్ రెడ్డి

జనవాహిని ప్రతినిధి తాండూరు; తెలంగాణ రాష్ట్రం తెచ్చిన నాయకుడు, 10ఏళ్ళు రాష్ట్రాన్ని కంటికి రెప్పలా కాపాడుకున్న మహాత్ముడు కెసిఆర్ చావును కోరుతున్నారు కాంగ్రెస్ నాయకులు. రాష్ట్రం లో అల్లర్లు సృష్టిస్తూ ఎర్రవెల్లి కి రౌడీలను పంపుతున్న రేవంత్ రెడ్డి అంటూ తాండూరు బిఆర్ఎస్ పార్టీ ఇంచార్జ్ శ్రీశైల్ రెడ్డి మండిపడ్డారు. రాష్ట్రం లో దొంగ హామీలు చూపించి గెలిచినా కాంగ్రెస్ పార్టీని అతి తొందర్లోనే బొందపెడతాం అని హెచ్చరించారు. అసెంబ్లీ కి కెసిఆర్ రావాలి సారు రావాలి అని పదే పదే పిలుస్తున్న సీఎం రేవంత్ రెడ్డి కి ఎదురుకునే దమ్ము ఉందా అంటూ ప్రశ్నించారు. ప్రస్తుతం రాష్ట్రం లో దొంగ కేసులు ప్రశ్నిస్తే రిమాండ్ లు చేస్తున్నారని ఆరోపించారు. అదేవిదంగా తాండూరు ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే నాయకులు చేసే అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు పెట్టి రిమాండ్ కు పంపుతున్నారని అగ్రహించారు. ప్రతిపక్ష పార్టీ గా ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వాల్సింది పొయ్యి కౌంటర్ లు ఇస్తున్నారన్నారు. తాండూరు అభివృద్ధి ని గాలికి వదిలేసి కౌంటర్ లు వ్యక్తిగత దుషనాలకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. ప్రభుత్వం ఏర్పాటు అయినా 1000 రోజుల్లో ఎన్ని హామీలు అమలు చేసారాని ప్రశ్నించారు. దొంగ హామీల పేర్లు చెప్పి ప్రజలను మభ్య పెట్టాలని చూస్తున్నారే తప్ప ఎలాంటి అభివృద్ధి కానీ, హామీలు కాని నెరవేర్చే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. తాండూరు వనరులను కొడంగల్ కు తరలించడం పై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాండూరు నియోజకవర్గం లో కాంగ్రెస్ పార్టీ పై ప్రజలు దుమ్మేతి పోస్తున్నారని, కాంగ్రెస్ పార్టీ కి కాలం చెల్లిందని ఆరోపించారు. బిఆర్ఎస్ పార్టీ కి తాండూరు ప్రజలు మద్దతుగా ఉన్నారని మా నాయకుడు మాజీ ఎమ్మెల్యే కు ప్రజలు ఘన స్వాగతం పలుకుతున్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమం లో మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ కొట్రిక విజయలక్ష్మి, తాండూరు బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నరేందర్ గౌడ్, నాయకులు కోహిర్ శ్రీనివాస్, రవీందర్ రెడ్డి, సంతోష్ గౌడ్ తదితరులు ఉన్నారు.

ప్రిన్సిపల్ పై దాడి…!

0

_ విద్యార్థి తల్లీతో అసభ్య ప్రవర్తన
_ దేహశుద్ధి చేసిన స్థానికులు
_ యాలల మండలం లో ఘటన

జనవాహిని ప్రతినిధి తాండూరు; మహాత్మా జ్యోతిభ ఫూలే పాఠశాల ప్రిన్సిపల్ ను స్థానికులు చితకబాదరు. పాఠశాలకు చెందిన ఓ విద్యార్థి తల్లీ తో అసభ్య ప్రవర్తన చేసాడనే ఆరోపణలు వెలువెత్తుతున్నాయి. ఈ ఘటన మంగళవారం యాలల మండలం అగ్గనూర్ గ్రామ సమీపంలో జరిగింది. విద్యార్థి తల్లీ పట్ల ప్రిన్సిపల్ నరేష్ అసభ్యంగా ప్రవర్తించరని స్థానికులు గమనించి దేహశుద్ధి చేశారు. విషయం తెలుసుకున్న యాలల పోలీసులు ప్రిన్సిపల్ నరేష్ ను అదుపులోకి తుసుకున్నారు. ఘటనపై విచారణ చేపడుతున్నట్లు సమాచారం.

కుళ్ళిపోయిన మృతదేహలు ..!

0

_ తాండూరు మండలం లో లభ్యం
_ విచారణ చేపడుతున్న పోలీసులు
_ హత్య ..? ఆత్మహత్య ..? అనేది సస్పెన్స్ గా మారింది

జనవాహిని ప్రతినిధి తాండూరు; ఓ పాడుబడిన ఇంట్లో రెండు మృతదేహాలు లభ్యం అయ్యాయి. కుళ్ళి పోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను చూసిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. తాండూరు మండలం ఐనెల్లి గ్రామ సమీపంలో ఆడ,మగ ఇద్దరి మృతదేహాలు లభ్యం అయ్యాయి. ఓ పాడు బడిన ఇంట్లో కుళ్ళిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహలు ఉన్న ప్రాంతంలో పురుగుల మందు డబ్బా ఉన్నట్టు పోలీసులు గుర్తించారు. అసలు ఆ ఇద్దరు ఎవరు..? ఏ ప్రాంతానికి చెందిన వారు..? ఇంతకీ ఇది హత్య..? లేక ఆత్మహత్య అనే కోణంలో పోలీసులు విచారణ చేపడుతున్నారు. ఈ ఘటన తో స్థానికంగా కలకలం రేపింది. పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.