- భక్తిశ్రద్ధలు, ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు
- అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలి
- తాండూరులో ఘనంగా పీస్ కమిటీ సమావేశం
- తాండూరు ఆర్డీఓ కర్ర అనిత
జనవాహిని ప్రతినిధి తాండూరు; తాండూరు డివిజన్ పరిధిలో గణేష్ చవితి ఉత్సవాలు, నిమజ్జనోత్సవాలను భక్తిశ్రద్ధలతో పాటు ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా నిర్వహించాలని ఆర్డీఓ కర్ర అనిత పిలుపునిచ్చారు. ఆర్డీఓ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులు, హిందూ ఉత్సవ సమితి ప్రతినిధులతో ప్రత్యేక పీస్ కమిటీ సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ, ఉత్సవాల సందర్భంగా ప్రజలు, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ముందస్తు ప్రణాళికతో పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రధాన కూడళ్లు, గణేష్ మండపాలు మరియు నిమజ్జన మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.
ముక్యంగా నిమజ్జన ఊరేగింపుల సమయంలో ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని, ప్రజల భద్రతకు ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలని పోలీసు శాఖకు సూచించారు.
విద్యుత్ లైన్ల లూజ్ వైర్లను సరిచేయడం, రోడ్ల మరమ్మతులు, నిరంతర తాగునీటి సరఫరా మరియు పారిశుధ్య లోపాలు లేకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఉత్సవాలు సామరస్యానికి ప్రతీకగా నిలిచేలా ఉత్సవ కమిటీలు, నిర్వాహకులు ప్రభుత్వ నిబంధనలను పాటిస్తూ అధికారులకు సహకరించాలని కోరారు.
ఈ సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ నీరజ బాల్రెడ్డి, డిఎస్పి నర్సింగ్ యాదయ్య, మున్సిపల్ కమిషనర్, సిఐలు, వివిధ శాఖల డిఈలు, ఏఈలు, తాండూరు, యాలాల తహసిల్దార్లు, ఎంపీడీవోలు, కౌన్సిలర్లు మరియు ఉత్సవ సమితి ప్రతినిధులు పాల్గొన్నారు.










